డా.బూదరాజు రాధాకృష్ణ-
ఆం.ప్ర.తెలుగు అకాడమీ డెప్యూటీ డైరెక్టరుగా, బహుగ్రంధకర్తగా, "ఈనాడు" దినపత్రిక జర్నలిజం స్కూలు ప్రిన్సిపాల్ గా, భాషాకోవిదునిగా-బహుముఖ విఖ్యాతి గాంచిన విజ్ఞానఖని. ఈయన మన హైస్కూలులో 1940లలో విద్యార్ధి. అంతేగాక- విద్యార్ధి దశలోనే-అద్భుతమైన భాషాపాండిత్యం ప్రదర్శించేవారు. చిన్నతనంలోనే, అనర్గళంగా ఆశువుగా పద్యాలు చెప్పగలిగేవారు. ఈ బాల భాషామేధావి-విద్యార్ధిగా వుండగా-ఒక విశేషం జరిగింది.
ఆరోజుల్లో- ఉద్దండ పండితులు- "కళాప్రపూర్ణ" కొత్త సత్యనారాయణ చౌదరి, ములుకుట్ల గోపాలకృష్ణయ్య, గూడ సత్యనారాయణ శాస్త్రి తదితర ప్రముఖులు మన హైస్కూలులో తెలుగు బోధించేవారు. సింగరాజు శ్రీనివాసరావుగారు ప్రధానోపాధ్యాయులు.
 |
| కొత్త సత్యనారాయణ చౌదరిగారు |
 |
| గూడ సత్యనారాయణ శాస్త్రి |
|
| బూదరాజుగారి క్లాసుకు కొత్త సత్యనారాయణ చౌదరిగారు తెలుగు ఉపాధ్యాయులు. వార్షిక పరీక్షలో తెలుగులో ఆ క్లాసులోని విద్యార్ధులంతా ఉత్తీర్ణులైనారు. ఒక్క బూదరాజుగారు మాత్రమే తెలుగు పరీక్షలో తప్పారు. మిగతా అన్ని సబ్జక్టులలో క్లాసులో అత్యధిక మార్కులు వచ్చాయి. అంత భాషామేధావి తెలుగులో తప్పడం-తోటి విద్యార్ధులకే కాక, ఉపాధ్యాయులందరికీ, చివరకు హెడ్మాస్టర్ గారికి కూడా ఆశ్చర్యమేసింది. |
హెడ్మాస్టరుగారు తన గదిలో తెలుగు ఉపాధ్యాయులందర్నీ సమావేశపరిచారు. బూదరాజుగారి తెలుగు పరీక్ష సమాధానపత్రాలు తెప్పించి, ఉపాధ్యాయులందర్నీపరిశీలించి, ఈ విద్యార్ధి ఎందుకు తప్పాడో కారణం చెప్పమని పురమాయించారు. చౌదరిగారు తప్ప, మిగిలిన పండితులంతా, ఆ పత్రాలు చూసి- " ఆహా! సమాధాన పత్రం మొత్తం అన్ని ప్రశ్నలకు సమాధానాలూ, ఆశుపద్యాలలో వ్రాశాడు. వీడి కవితాధార పెద్దలలోకూడా అసాధ్యం! వీటికి సున్నా మార్కులు వేయడం ఏమిటి? మరేదో కారణం మనసులో పెట్టుకుంటే తప్ప-వీణ్ణి తెలుగులో తప్పించడానికి వీల్లేదు."-అని తీర్మానించారు. హెడ్మాస్టరుగారు ఆ తరగతి తెలుగు ఉపాధ్యాయుడైన చౌదరిగారిని వివరణ అడిగారు. అందుకాయన- " అయ్యా! గద్యభాగ సమాధానాలు గద్యంలోనే వ్రాయాలి. ఇతను, తనకు ఆశు రచన వచ్చునని చాటుకోవడానికే సమాధానాలు ఆశు పద్యాలలో వ్రాశాడు. విద్యార్ధికి పాండిత్యం వున్నది. కాని జవాబులు అడిగిన రీతి లోనే వ్రాయాలి కదా! లేకపోతే, అడిగిన సమాధానం అతనికి రాదని అనుకోవాలి. అందుకే సున్నా మార్కులు వేశాను."-అని చెప్పారు.
అడిగిన రీతిలో మరల పరీక్ష అక్కడికక్కడే వ్రాసి నూరు శాతం మార్కులు సాధించారు బూదరాజు!!
No comments:
Post a Comment